: పిల్లల చదువుల కోసం కిడ్నీని అమ్మకానికి పెట్టిన తల్లి!

పిల్లల చదువుల కోసం ఓ తల్లి తన కిడ్నీని అమ్మకానికి పెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, రోహత ప్రాంతానికి చెందిన ఆర్తి శర్మ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో తన కిడ్నీని అమ్మకానికి పెడుతూ తన ముగ్గురు కూతుళ్లు, కొడుకు చదువు కోసం ఈ పని చేయక తప్పడం లేదని పేర్కొన్నారు. తమకున్న చిన్న గార్మెంట్ షాపు నోట్ల రద్దు కారణంగా మూతపడిందని, తద్వారా కష్టాల్లో కూరుకుపోయామని పేర్కొన్నారు.

పిల్లల స్కూలు ఫీజులు చెల్లించకపోవడంతో వారు స్కూలుకు వెళ్లడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. జిల్లా అధికారులను కలిసి అర్థించినా తమకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 29న ఇంట్లోని  గ్యాస్ సిలిండర్‌ను బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బులతో లక్నో వెళ్లి ముఖ్యమంత్రి అదిత్యనాథ్ యోగిని కలిసి గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి సహాయసహకారాలు అందలేదన్నారు.

ఆర్తి భర్త మనోజ్ శర్మ మాట్లాడుతూ.. పిల్లల చదువుల కోసం కిడ్నీని అమ్మాలన్నది ఆమె నిర్ణయమని తెలిపారు. తాను టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, నెలకు రూ.4-5 వేలు వస్తాయని పేర్కొన్నాడు. తమకు ప్రభుత్వం సాయం చేస్తే చిన్న వ్యాపారం ప్రారంభించి పిల్లలను చదివించుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News