: ఆస్ట్రేలియా అభ్యర్థనను తిరస్కరించిన భారత్.. చైనా హెచ్చరికలే కారణమా?

డ్రాగన్ కంట్రీ చైనా హెచ్చరికలకు, ఒత్తిడికి భారత్ తలొగ్గుతోందా? అంటే ఔననే అనిపిస్తోంది. తాజాగా జరిగిన ఓ అంశం గురించి ఆలోచిస్తే నిజమనే అనుకోవాల్సి వస్తుంది. జపాన్ తో కలసి తాము నిర్వహిస్తున్న సంయుక్త నేవీ కసరత్తుల్లో పాల్గొనాలంటూ భారత్ ను ఆస్ట్రేలియా అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను భారత్ తిరస్కరించింది. ఈ డ్రిల్స్ పై చైనా చేసిన హెచ్చరికల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత నేవీ అధికారులు, దౌత్యవేత్తలు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే, జూలై నెలలో జరిగే సంయుక్త కసరత్తులను వీక్షించేందుకు నేవీ నౌకలను పంపాలని భారత రక్షణశాఖకు ఆస్ట్రేలియా ఓ లేఖను పంపింది. మన నౌకలను పంపితే, భవిష్యత్తులో జరిగే మిలిటరీ విన్యాసాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా అంచనా వేశారు. కానీ ఈ సంయుక్త విన్యాసాలను వీక్షించేందుకు తాము వెళ్లడం లేదని నిన్న భారత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు త్వరలోనే బంగాళాఖాతంలో జరిగే నేవీ కసరత్తులను వీక్షించేందుకు రావాలంటూ ఆస్ట్రేలియాను ఆహ్వానించారు.

వాస్తవానికి దీని వెనుక అసలైన కథ వేరేది ఉందని కొందరు చెబుతున్నారు. పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక సముద్ర తీరాల్లో తన కార్యకలాపాలను చైనా మరింత తీవ్రతరం చేస్తుందన్న అంచనాలతోనే భారత్ ఇలా చేసిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చైనాకు చెందిన ఆరు సబ్ మెరైన్లు హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, జపాన్ లు నిర్వహిస్తున్న విన్యాసాలకు భారత్ హాజరైతే... చైనా మరిన్ని సబ్ మెరైన్లను మోహరించే ప్రమాదం ఉందని మారిటైమ్ అబ్జర్వర్ ఇన్స్టిట్యూట్ హెడ్ అభిజిత్ అభిప్రాయపడ్డారు.

More Telugu News