: పెళ్లయిన మర్నాడే భర్తను జైల్లో పెట్టించిన నవ వధువు!

తల వంచుకుని తాళి కట్టించుకున్న మర్నాడే భర్తను జైల్లో పెట్టించిందో నవవధువు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని కోరియా జిల్లాలో జరగగా, ఇప్పుడా వధువు ధైర్యంగా తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, కోరియా పట్టణానికి చెందిన యువతికి, సమీప గ్రామంలోని ఓ యువకుడికి సోమవారం నాడు వివాహమైంది. పెళ్లి సందర్భంగా ముందుగా అనుకున్న కట్న కానుకలన్నింటినీ వధువు కుటుంబం సమకూర్చింది. పెళ్లి తరువాత వరుడిలోని మరో కోణం బయటకు వచ్చింది.

అదనపు కట్నం, కూలర్, ఫ్రిజ్ తదితర వస్తువులు కావాలని అతను డిమాండ్ చేశాడు. ఇప్పట్లో అవి ఇచ్చుకోలేమని పెద్దమనుషులతో చెప్పించినా వినలేదు. ఈ వ్యవహారాన్ని కొన్ని గంటల పాటు ఓర్పుతో చూసిన వధువులోని సివంగి బయటకు వచ్చింది. ఈ కట్న పిశాచి తనకు వద్దని చెబుతూ, ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు బయలుదేరింది. ఆమె తల్లిదండ్రులు వారించినా వినలేదు. వధువు ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, నేడు వరుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టగా, వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News