: చంద్రబాబూ.. నీ లాంటి మోసగాళ్లకు తెలంగాణలో చోటు లేదు: నిప్పులు చెరిగిన కేసీఆర్
తాము ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన అంశాలను 100 శాతం అమలు చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతులకు రుణమాఫీ నుంచి అన్ని అంశాలనూ అమలుచేస్తూ ముందుకు వెళుతున్నామని అన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ మహానాడులో ఎన్నో అసత్య వ్యాఖ్యలు చేశారని కేసీఆర్ ఆరోపించారు. ‘మేము తెలంగాణలో రైతుల రుణమాఫీ పూర్తిగా చేశాం. అదే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేయలేదు.. మోసం చేశాడు. నిన్న ఎన్నో మాట్లాడాడు. ఆంధ్ర రైతులకు, ఆంధ్ర డ్వాక్రా మహిళలకు టోపీ పెట్టిన చంద్రబాబు ఇంక తెలంగాణలోకి వస్తాడట. మొట్టమొదట నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పు. నువ్వు చెప్పింది ఏంటీ.. డ్వాక్రా మహిళలందరికీ రుణాలు మాఫీ చేస్తా అన్నావ్.. రైతుల మొత్తం రుణాలు మాఫీ చేస్తా అన్నావ్.. మళ్లీ గిమ్మిక్కులు చేశావు’ అని కేసీఆర్ మండిపడ్డారు.
‘ప్రజలను మోసం చేశావు.. నీలాంటి మోసగాళ్లకు తెలంగాణలో తావు లేదు.. నువ్వు మాకు అవసరం లేవు.. కాబట్టి నువ్వు ఉన్న జాగలో మీ ప్రజలకు సేవ చేసుకో.. తెలంగాణకు నువ్వు వచ్చినా ఇక్కడ నీకు వచ్చేదేమీ ఉండదు.. డిపాజిట్లు కూడా దక్కవు’ అని చంద్రబాబు నాయుడిని కేసీఆర్ విమర్శించారు. ఇక్కడ ఉనికిని కోల్పోయిన తెలుగు దేశం, కాంగ్రెస్ రకరకాలుగా మాట్లాడుతూ ప్రజలను అయోమయం చేసే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ నిప్పులు చెరిగారు.