: ప్రియుడితో భ‌ర్త‌ను అతి దారుణంగా చంపించిన మ‌హిళ‌!

ప‌శ్చిమ బెంగాల్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న కాలేజీ రోజుల నుంచి ప‌రిచ‌యం ఉన్న ఓ వ్య‌క్తితో 28 ఏళ్ల ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను అతి దారుణంగా చంపించింది. త‌న ప్రియుడు త‌న భర్తను పొడిచి చంపుతుండ‌గా ఆ చావుకేకలను త‌న ఫోన్లో విని రాక్ష‌సానందం పొందింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప‌లు వివ‌రాలు తెలిపారు. ఆ రాష్ట్రంలోని బరసాత్ మునిసిపాలిటీలో క్యాజువల్ వర్కర్‌గా పనిచేస్తున్న మనువా మజుందార్ (28) అనే ఆ మహిళ.. త‌నకి పెళ్లి కాక‌ముందు నుంచి ప‌రిచ‌య‌స్తుడయిన‌ అజిత్ రాయ్ (26)తోనే జీవించాల‌ని అనుకుంది. అందుకోసం త‌న‌ భర్త అనుపమ్ సిన్హా (34) ను త‌న ప్రియుడితో చంపాల‌ని ప్లాన్ వేసి త‌మ ఇంటి తాళాన్ని అజిత్ రాయ్‌కి ఇచ్చి త‌న భ‌ర్త‌ను చంప‌మ‌ని పురమాయించి, తను వేరే చోటకి వెళ్లింది.

ప్లాన్ ప్రకారం, వాళ్ల ఫ్లాట్‌లోకి ముందుగానే ప్రవేశించిన అత‌డు.. అనుప‌మ్ సిన్హా లోపలకు రాగానే ఒక ఇనుప రాడ్‌తో తలమీద బాదాడు. అనంత‌రం అదే రాడ్‌ను అతడి గొంతులోకి గుచ్చాడు. త‌న ప్రియురాలు మనువాకు ఫోన్ చేసి, అత‌డి చావు కేకలను వినిపించాడు. అనంత‌రం మ‌రింత దారుణంగా అనుపమ్ సిన్హా  త‌ల‌పై పొడిచిన అజిత్ రాయ్.. ఆ త‌ర్వాత ఆ అపార్టుమెంటును శుభ్రంగా తుడిచాడు. మ‌రుస‌టి రోజు గంగానదిలో స్నానం చేసి, రక్తంతో తడిసిన తన దుస్తులను, అనుపమ్ సెల్‌ఫోన్‌ను నదిలో పారేశాడు. ఎట్ట‌కేల‌కు పోలీసులు ఈ కేసును ఛేదించారు. తన భార్య ప్రేమ విషయం అనుపమ్‌కు తెలిసిపోయింద‌ని, అందుకే ఆమె త‌న భ‌ర్త‌ను చంపించింద‌ని పోలీసులు వివ‌రించారు.                          

More Telugu News