: తొమ్మిదవ తరగతి విద్యార్థినిని స్కూలు పై అంతస్తు నుంచి తోసేసిన టీచర్లు!

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తొమ్మిదవ తరగతి విద్యార్థినిని టీచ‌ర్లంతా క‌లిసి స్కూలు పై అంతస్తుపైకి తీసుకెళ్లి మ‌రీ అక్క‌డి నుంచి కింద‌కు తోసేశారు. దీంతో ఆ విద్యార్థినికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఆమె వెన్నెముక కూడా విరిగిపోయిందని, ప్ర‌స్తుతం ఆ అమ్మాయి ఆసుప‌త్రిలో చావుబ‌తుకులతో పోరాడుతోందని వైద్యులు తెలిపారు. ఈ నెల 23న జ‌రిగిన ఈ ఘ‌ట‌న గురించి బయటకు తెలియ‌కుండా ఉండేందుకు టీచ‌ర్లు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. చివ‌రికి ఆ విద్యార్థిని త‌ల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆ టీచ‌ర్ల‌పై హ‌త్యాయ‌త్నం కేసు పెట్టారు.

మ‌రిన్ని వివ‌రాల్లోకి వెళితే, ఫజ్జర్ నూర్ (14) అనే ఆ బాలిక లాహోర్ నగరంలోని ఓ పాఠ‌శాల‌లో చ‌దువుకుంటోంది. తరగతి గదులను ప్రతిరోజూ ఒక్కో విద్యార్థినితో టీచ‌ర్లు శుభ్రం చేయిస్తారు. మే 23న ఫజ్జర్ వంతు రావ‌డంతో ఆమెను శుభ్రం చేయ‌మ‌ని చెప్పారు. ఆరోజు త‌న‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో త‌న ప‌నిని మరోరోజు చేస్తానని ఆ బాలిక తెలిపింది. దీంతో ఆ బాలిక‌ను టీచ‌ర్లు చెంపల మీద కొట్టి, ఆ తర్వాత మూడవ అంతస్తు పైకి తీసుకెళ్లి అక్కడున్న గదిని శుభ్రం చేయమని బెదిరించారు. ఆ అమ్మాయి ఒప్పుకోక‌పోవ‌డంతో అక్కడి నుంచి తోసేశారు. ఈ చర్యకు పాల్పడిన టీచర్లు రెహానా కౌసర్, బుష్రా తుఫైల్ అనే ఇద్దరిపై హత్యాయత్నం కేసు న‌మోదైంది.                      

More Telugu News