: యాంకర్ సుమ ప్రశ్నకు దీటుగా సమాధానమిచ్చిన పరిపూర్ణానంద స్వామి!

ఇటీవల తాను ప్రారంభించిన ఆధ్యాత్మిక చానల్ కోసం శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఒక్కో సెలబ్రిటీని ఆహ్వానించి, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేళ, అతిథిగా వచ్చిన ప్రముఖ యాంకర్ సుమ, "స్వాములకు రాజకీయాలు అవసరమా?" అని ప్రశ్నించగా, స్వామి దీటైన సమాధానం ఇచ్చారు. స్వాములకు రాజకీయాలెందుకని రాజకీయ నేతలే ప్రశ్నిస్తున్నారని చెప్పిన ఆయన, స్వాములను చూస్తే నేతలకు భయమని అన్నారు. సాధారణంగా రాజకీయ నాయకులకు కుటుంబం ఉంటుందని, వాళ్ల వ్యాపారాలు, ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉదాహరణగా చూపారు. ఆయన ఓ సన్యాసని, భార్య, పిల్లలు, ఇల్లు లేని ఆయన రాజకీయాల నుంచి బయటకు వస్తే, ఓ బ్యాగ్ భుజాన వేసుకుని ఆర్ఎస్ఎస్ లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటారని.. లేకుంటే, ఏ రుషీకేష్ కో వెళ్లి తపస్సు చేసుకుంటారని చెప్పుకొచ్చారు. మిగతా రాజకీయ నాయకులు అలా చేయలేరని, వాళ్ల వెనుక చాలా బాధ్యతలు ఉండటమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఎటువంటి బాధ్యతలు, బాదరబందీ లేని వాళ్లు రాజకీయాల్లోకి వస్తే, ఎంతో కొంత చేస్తారని పరిపూర్ణానంద అన్నారు. ఈ సమాధానానికి సుమ కూడా సంతృప్తి చెందినట్టే కనిపించింది.

More Telugu News