: 'అనిల్ కుంబ్లేతో పోటీకి సై' అంటున్న వీరేంద్ర సెహ్వాగ్

భారత క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే ఏడాది పదవీ కాలం చాంపియన్స్ ట్రోఫీ ముగియగానే పూర్తి కానుండటం, ఆయన పదవీ కాలాన్ని పొడిగించే బదులు మరోసారి దరఖాస్తులు ఆహ్వానించాలని బీసీసీఐ నిర్ణయించడంతో డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రంగంలోకి దిగాడు. పలు పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల మేరకు, బీసీసీఐ జనరల్ మేనేజర్లలో ఒకరు సెహ్వాగ్ ను సంప్రదించి, ఈ పదవికి దరఖాస్తు చేసుకోవాలని కోరారని తెలుస్తోంది. ఇప్పటికే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు కోచ్ గా సేవలందించిన ఆయన అనుభవం ఈ పదవికి ఉపకరిస్తుందని కూడా సదరు జీఎం సలహా ఇచ్చారని సమాచారం. కాగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కూడా హెడ్ కోచ్ పోస్టుకు పోటీ పడవచ్చని వార్తలు వస్తున్నాయి. కుంబ్లే కోచ్ గా ఉన్న సమయంలోనే ఐదు టెస్టుల సిరీస్ ను గెలుచుకున్న భారత్, టెస్టుల్లో మొదటి స్థానాన్ని నిలుపుకున్న సంగతి తెలిసిందే. కుంబ్లేకు మద్దతుగా ఉన్న వారు మాత్రం మరో ఏడాది పాటు కాంట్రాక్టును పొడిగించాలని ఒత్తిడి తెస్తున్నారు. కాగా, కుంబ్లేకు తాను పోటీ పడనున్నట్టు వచ్చిన వార్తల విషయంలో సెహ్వాగ్ ఇంకా స్పందించలేదు.

More Telugu News