: కంప్యూటర్ క్రాష్... బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానాలు రద్దు!

బ్రిటన్ ను కంప్యూటర్ సమస్యలు వెంటాడుతున్నాయి. ఇటీవల 'వాన్నా క్రై' హ్యాకింగ్ బారిన పడి ఆరోగ్యశాఖకు చెందిన కంప్యూటర్లన్నీ హ్యాక్ అయి తీవ్ర ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా కంప్యూటర్ వ్యవస్థ క్రాష్‌ కావడంతో బ్రిటీష్ ఎయిర్ వేస్ తన విమానాలన్నింటినీ రద్దు చేసింది. మేజర్ ఐటీ సిస్టమ్ ఫెయిల్యూర్ తో ప్రపంచవ్యాప్తంగా నడిపే తమ విమాన కార్యకలాపాల్లో తీవ్ర అంతరాయం చోటుచేసుకుందని బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన బ్రిటిష్ ఎయిర్ వేస్... రీషెడ్యూలింగ్, రీఫండ్ విధానంలో ప్రయాణికులు ఏం కావాలంటే దానిని వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తామని ఈ ప్రకటనలో తెలిపింది.

లండన్ లోని రెండు ప్రధాన (హీత్రూ, గాట్విక్) విమానాశ్రయాల నుంచి నడిపే విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. వేసవి కావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగి కంప్యూటర్ క్రాష్ అయిందని బ్రిటష్ ఎయిర్ వేస్ తెలిపింది. ఈ రెండు విమానాశ్రయాల నుంచి ప్రయాణించే ఇతర వైమానిక సంస్థలపై ఈ ప్రభావం లేదని, ఆయా విమానాలు ఎయిర్ పోర్టుకు వస్తాయని, వాటి ప్రయాణ వేళలు, ల్యాండింగ్ లో ఎలాంటి సమస్య లేదని తెలిపింది. లోకల్ టైమ్ సాయంత్రం ఆరుగంటల వరకు హీత్రూ, గాట్విక్ విమానాశ్రయాల నుంచి ప్రయాణించాల్సిన ప్రయాణికులకు సమస్యలు ఎదురవ్వవని భావిస్తున్నామని, సాయంత్రం ఆరు గంటల తరువాత ప్రయాణించే ప్రయాణికులు కూడా తమ విమాన ప్రయాణ సమయాలను ఓ సారి చెక్ చేసుకోవాలని బ్రిటీష్ ఎయిర్ వేస్ కోరింది.

More Telugu News