: 'రిపబ్లిక్ టీవీ'పై శశిథరూర్ పరువు నష్టం దావా.. రూ.2 కోట్ల నష్టపరిహారానికి డిమాండ్!

ప్రముఖ జర్నలిస్టు అర్ణాబ్ గోస్వామి, ఆయన ఆధ్వర్యంలోని న్యూస్ చానల్ 'రిపబ్లిక్ టీవీ'పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కోర్టుకెక్కారు. తన భార్య సునందా పుష్కర్‌ మృతికి సంబంధించిన వార్తలను ప్రసారం చేసి తన హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించిన అర్ణాబ్ నుంచి తనకు రూ.2 కోట్ల నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. అలాగే తన భార్య సునంద పుష్కర్‌కు సంబంధించిన కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు రిపబ్లిక్ టీవీ ఎటువంటి వార్తలు ప్రసారం చేయకుండా నిలువరించాలని కోరారు.

ఈ సందర్భంగా మే 8 నుంచి మే 13 మధ్య కాలంలో సునంద మృతిపై రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన వార్తలను తన ఫిర్యాదుకు జోడించారు. ఇటువంటి వార్తలను ప్రసారం చేయడం వలన దాని ప్రభావం దర్యాప్తుపై పడుతుందన్నారు. రిపబ్లిక్ టీవీ ప్రసారాలతో ప్రజల్లో తాను చులకనయ్యానని, తన పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన నష్టానికి అర్ణాబ్, టీవీ చానల్ నుంచి రూ.2 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు.

More Telugu News