: కోళ్లను పెంచండి కానీ, తినేందుకు అమ్మకండి అంటే ఎలా?: ప్రొఫెసర్ కంచ ఐలయ్య

ఆవులు, ఎద్దులు, బర్రెలు, ఒంటెలు, దూడలు వంటి పశువుల వధపై దేశ వ్యాప్తంగా నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి ఓ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ నిబంధనలు మూడు నెలల తర్వాత అమల్లోకి వస్తాయని గెజిట్ లో వివరించారు. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ, ప్రపంచంలో ఎక్కడా లేని మానవ ప్రవృత్తిని భారతదేశంలో బీజేపీ ప్రవేశపెట్టాలని చూస్తోందని విమర్శించారు.

ఈ రోజున ఏ రైతూ కూడా వ్యవసాయానికి తమ పశువులను వాడుకునే పరిస్థితిలో లేడని, వాటిని ఎకనామికల్ ఏనిమల్ గా ఉపయోగించే పరిస్థితిలోనే ఉన్నాడని అన్నారు. ‘కోళ్లను పెంచండి, కానీ, కోసుకుని తినడానికి అమ్మకండి' అని అంటే ఎవరు పెంచుతారు?’ అని  ఆయన ప్రశ్నించారు. బీఫ్ తో మొదలు పెట్టి ఇప్పుడు బర్రెలు, ఒంటెలు, దూడలు వంటి పశువులను కూడా చేర్చారని, రేపు అందరినీ శాకాహారులుగా మారమంటే, ఈ దేశాన్ని చైనా నుంచి, పాకిస్థాన్ నుంచి ఎవరు కాపాడతారని ఐలయ్య ప్రశ్నించారు.

More Telugu News