: భారత్ దూసుకెళుతోంది: అమెరికాలో ఇండియాపై ప్రశంసల వర్షం

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇదే విష‌యంపై అమెరికా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ భారత్‌ను ఆకాశానికెత్తేశారు. దేశీయంగా, అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడంలో ఇండియా ఊహించ‌ని విధంగా దూసుకుపోతోంద‌ని అన్నారు. తాజాగా అమెరికా ప్రజా ప్రతినిధుల సమావేశంలో యూనివర్సిటీ ఆఫ్‌ మేరిలాండ్‌ స్కూల్‌ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీకి చెందిన ప్రొఫెసర్‌ రాబర్ట్‌ ఓర్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌గా ఆయ‌న‌తో వారంతా ఏకీభ‌వించారు. ఇండియా ప‌లు రంగాల్లో శరవేగంగా, శ్రద్ధగా ముందుకు వెళుతోంద‌ని రాబర్ట్‌ ఓర్ అన్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ వంటి విషయాల్లోనూ ఎంతో అభివృద్ధి సాధిస్తోంద‌ని, వినూత్నంగా ఆలోచన చేస్తూ వెళుతోంద‌ని అన్నారు.

సౌర విద్యుత్‌, పవన విద్యుత్‌ వంటి రంగాల్లో భారత్ గొప్ప‌ ఆశయాలను, ల‌క్ష్యాల‌ను పెట్టుకుంద‌ని తెలిపారు. భార‌త ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ తీసుకొచ్చిన స్మార్ట్‌ సిటీస్ అనే అంశం ఒక వ్యూహాత్మక అడుగుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. అటు వ్యాపార పరంగా ఇటు ఆర్థికాభివృద్ధి ప‌రంగా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అమెరికాలాగే ఎన్నో అవకాశాలను భారత్‌ అందిస్తోందని చెప్పారు. ఇదే విషయంలో చైనాలాంటి దేశం కూడా ఉన్నప్పటికీ భార‌త్‌ అంతకంటే సునాయాసంగా, శరవేగంగా అడుగులు వేస్తుంద‌ని అన్నారు.                 

More Telugu News