: త‌ల్లిని చంపి.. ద‌మ్ముంటే త‌న‌ను ప‌ట్టుకోవాల‌ని ర‌క్తంతో రాసి పారిపోయిన కొడుకు అరెస్టు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన‌ షీనా బోరా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసధికారి జ్ఞానేశ్వర్ గనోరె భార్య దీపాలి గనోరెను ఆయ‌న కొడుకే దారుణంగా హ‌త్య చేసి పారిపోయిన విష‌యం తెలిసిందే. అనంత‌రం అత‌డు త‌న త‌ల్లి రక్తంతో ఇంట్లో నేలమీద 'ఆమె అంటే విసుగెత్తిపోయింది. దమ్ముంటే నన్ను పట్టుకుని ఉరితీయండి' అని రాశాడు. ముంబైలోని శాంతాక్రజ్ లో జ‌రిగిన ఈ హ‌త్య కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ఎట్ట‌కేల‌కు నిందితుడిని ప‌ట్టుకున్నారు. క‌న్న కొడుకే త‌ల్లిని ఎందుకు చంపాడ‌న్న అంశంపై వివ‌రాలు తెలిపారు.

ఆ పోలీస‌ధికారి భార్య పెళ్లయిన తరువాత కూడా లండన్ వెళ్లి మరీ ఉన్నత విద్యను పూర్తి చేసి వ‌చ్చార‌ని, అయితే, ఆమె కొడుకు సిద్ధాంత్ చదువులో చాలా వెన‌క‌బ‌డిపోవ‌డంతో అత‌డిపై ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉండేద‌ని తెలిపారు. ప‌దే ప‌దే చదువుకోమంటూ విసుగిస్తోందని, మార్కులు తక్కువ తెచ్చుకుంటుండడంతో తిడుతోందని సిద్ధాంత్ త‌న‌ త‌ల్లిపై కోపం పెంచుకున్నాడ‌ని పోలీసులు చెప్పారు. ఇంట్లో త‌న త‌ల్లిని చంపి పారిపోయేట‌ప్పుడు రెండు లక్షల రూపాయలు కూడా తీసుకెళ్లాడ‌ని తెలిపారు. సిద్ధాంత్ జోధ్ పూర్ లో ఉంటున్నాడ‌ని క‌నిపెట్టిన పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో అరెస్టు చేశారు. నిందితుడు త‌న నేరాన్ని ఒప్పుకున్నాడ‌ని పోలీసులు చెప్పారు.  ఈ కేసుకు సంబంధించి తదుపరి విచార‌ణ కొన‌సాగుతోంద‌ని  తెలిపారు.                                     

More Telugu News