: ప్రయాణికులను ఖుషీ చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నయా ప్లాన్... డీలక్స్ బస్సుల్లో చల్లదనం కోసం ఎయిర్ కూలర్లు

ఈ వేసవిలో ప్రయాణికులను వడదెబ్బ బారి నుంచి కాపాడేందుకు ఇప్పటికే అల్ట్రా డీలక్స్ బస్సుల్లో చల్లని తాగు నీటి సదుపాయాన్ని అందిస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇప్పుడు మరో వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి డిపోకు చెందిన డీలక్స్ బస్సులో ఎయిర్ కూలర్ సౌకర్యాన్ని అధికారులు ప్రారంభించారు. సురక్షిత ప్రయాణంతో పాటు చల్లదనాన్ని అందించాలన్న లక్ష్యంతో ఈ ఆలోచన చేశామని, అన్ని డీలక్స్ బస్సుల్లో ఈ తరహాలో కూలర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. వేడిగాలులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా, వారికి ఉపశమనాన్ని కలిగించాలని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కాగా, ఈ ఆలోచన సత్ఫలితాలను ఇస్తే, మిగతా డిపోల్లోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

More Telugu News