: తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపినందుకు కేసీఆర్ కలత చెందారు: హ‌రీశ్‌రావు

తెలంగాణలో ప‌ర్య‌టించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌పై నిన్న సీఎం కేసీఆర్ మండిప‌డ్డ విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం త‌గ్గ‌కుండా కేసీఆర్‌పై బీజేపీ నేత‌లు మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు బీజేపీ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. కేసీఆర్ చెప్పిన విష‌యాల‌న్నీ సత్యాలేన‌ని బీజేపీ నేతలే అంగీకరించారని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు వాళ్లు సమాధానం ఇవ్వలేదని చెప్పారు. అస‌లు కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అమిత్ షా వెళ్లిపోయారని, దీంతో అమిత్ షా చెప్పినవన్నీ అస‌త్యాలేన‌ని అర్థ‌మ‌వుతోంద‌ని అన్నారు.

బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపినందుకు కేసీఆర్ క‌ల‌త చెందార‌ని వ్యాఖ్యానించారు. అమిత్ షా చెప్పిన అస‌త్యాల‌కు ఆయ‌న‌ కనీసం రాష్ట్ర‌ ప్రజలకు క్షమాపణ చెప్పినా బాగుండేదని హ‌రీశ్‌రావు అన్నారు. బీజేపీ నేత‌లకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హైకోర్టు విభజన వంటి అంశాల‌పై మాట్లాడాల‌ని అన్నారు. తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వం స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తోంద‌ని, తాము గ్రామీణ ప్రాంతాలకు కూడా 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్నామని హ‌రీశ్‌రావు అన్నారు.
 

More Telugu News