: టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ రెడీ: కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము కూడా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తెలుగుదేశం పార్టీతో గతంలో ఉన్న శత్రుత్వం ఇప్పుడు లేదని తెలిపారు. టీడీపీ తమకు అంటరాని పార్టీ కాదని అన్నారు. అయితే టీఆర్ఎస్, బీజేపీలకు మాత్రం తాము పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన వల్ల తెలంగాణకు ఏమాత్రం ఉపయోగం లేదనే విషయం తనకు ముందే తెలుసని అన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిందేమీ లేదని... రాష్ట్రానికి వచ్చిన నిధులన్నీ చట్ట ప్రకారం, రాజ్యంగ బద్ధంగా వచ్చినవే అని తెలిపారు. అమిత్ షా చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలే అని విమర్శించారు.
టీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని జైపాల్ రెడ్డి విమర్శించారు. మోదీతో స్నేహం అంటూనే, అమిత్ షాతో వైరం అంటూ కేసీఆర్ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ మ్యాచ్ ఫిక్సింగేనని అన్నారు. బీజేపీతో కేసీఆర్ కు రహస్య అజెండా ఉందని జైపాల్ రెడ్డి ఆరోపించారు. అయితే టీఆర్ఎస్ ముఖ్యనేతలు, మంత్రులపై కేంద్ర ప్రభుత్వ నిఘా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. ఈ రెండు పార్టీలు తప్ప మిగిలిన అన్ని పార్టీలతో తాము సన్నిహితంగానే ఉంటామని చెప్పారు.