: యూపీలో ఘోరాతి ఘోరం... కారును అటకాయించి సహచరుడిని చంపి, పిల్లలను కొట్టి దోపిడి.. నలుగురు యువతులపై గ్యాంగ్ రేప్!

ఉత్తరప్రదేశ్ లో ఘోరాతి ఘోరం జరిగింది. నిన్న రాత్రి తమ వాహనంలో ఎనిమిది మంది ఒకే కుటుంబ సభ్యులు బులంద్ షహర్ కు బయలుదేరగా, దాడికి దిగిన దుర్మార్గులు, ఆ బృందంలోని పురుషుడిని హత్య చేసి, పిల్లలను కొట్టి, వారి వద్దనున్న నగలు, నగదును దోచుకోవడమే కాకుండా, నలుగురు మహిళలపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. దేశ రాజధాని శివార్లలోని గ్రేటర్ నోయిడా రీజియన్ పరిధిలోని జీవర్ - బులంద్ షహర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, దాడిలో కనీసం ఆరుగురు వ్యక్తులు భారీ ఎత్తున ఆయుధాలతో వచ్చి పాల్గొన్నారు. తొలుత కారు టైరును తుపాకిని పేల్చి పంచర్ చేసిన దుండగులు, ఆపై దారుణానికి ఒడిగట్టారు. తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు వారితో తలపడిన వ్యక్తిని తుపాకితో కాల్చి చంపారు. వారి వద్ద ఉన్న రూ. 14 వేల నగదును అపహరించుకుపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు మహిళలను వైద్య పరీక్షలకు పంపారు. తీవ్రంగా గాయపడిన ఓ చిన్నారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. కాగా, ఈ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఈ తరహా సంఘటనలు తరచూ జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News