: నారాయణరెడ్డిని హత్య చేయడానికి కారణం ఇదే!: పోలీసుల విచారణలో నిందితులు

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ నారాయణ రెడ్డిని దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

పోలీసులకు నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఇదే...

"ఎప్పట్నుంచో మా మధ్య పాత కక్షలు ఉన్నాయి. మా సొంత పొలాలకే నారాయణరెడ్డికి కప్పం కట్టాల్సి వచ్చింది. మా ఆడవాళ్లను వారు చెరబట్టారు. మా తాతలను, తండ్రులను చంపారు. తరతరాలు వారికి భయపడుతూ బతకాల్సిందేనా? అందుకే నారాయణరెడ్డిని మేము హత్య చేశాం"

వాస్తవానికి ఈ హత్యకు ముందస్తు ప్రణాళిక ఏమీ లేదని ఓ నిందితుడు తెలిపాడు. కొసనపల్లెకు నారాయణరెడ్డి వస్తున్నాడని తమకు ఒక రోజు ముందు మాత్రమే తెలిసిందని... దీంతో, అప్పటికప్పుడు అందర్నీ కూడగట్టుకుని స్కెచ్ వేశామని చెప్పాడు. ఎవరికి వారు ఇళ్ల నుంచి కత్తులు తీసుకొచ్చామని... రామాంజనేయులు, రామానాయుడులు ట్రాక్టర్లను తెచ్చారని తెలిపాడు. నారాయణరెడ్డి వాహనాన్ని ఒక్కసారిగా ముందు, వెనుకల నుంచి ఢీకొట్టామని... ఏమాత్రం ఆలస్యం చేయకుండా నారాయణరెడ్డి, సాంబశివుడిని చంపేశామని చెప్పాడు.  

More Telugu News