: మూడేళ్ల మోదీ పాలన: పెరిగిన నిరుద్యోగుల సంఖ్య

నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ మూడేళ్లలో ఇండియాలో నిరుద్యోగుల సంఖ్య స్వల్పంగా పెరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నూతన ఉద్యోగ సృష్టి అనుకున్నంత మేరకు జరగడం లేదని 'ఇండియా స్పెండ్' తన తాజా విశ్లేషణలో పేర్కొంది. మోదీ పదవిలోకి రాకముందు... అంటే 2013-14లో ఇండియాలో 4.9 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఇప్పుడు 5 శాతానికి చేరుకుంది. ఎన్నికల మ్యానిఫెస్టోలో భాగంగా ఉద్యోగం, స్వచ్ఛ భారత్, రహదారులు, విద్యుత్, ఉగ్రవాదం వంటి కీలకాంశాల్లో మోదీ ఇచ్చిన హామీలపై విశ్లేషణ జరిపిన 'ఇండియా స్పెండ్' తన నివేదికను విడుదల చేసింది.

2013లో ఆగ్రాలో జరిగిన ఓ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను సృష్టిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడేళ్లలో ఆ హామీ నెరవేరలేదు. ఇంకో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఆ లోగా కొత్తగా కోటి మందికి ఉద్యోగాలు లభించే అవకాశాలూ కనిపించడం లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. జూలై 2014 నుంచి డిసెంబర్ 2016 వరకూ కీలక రంగాలైన మాన్యుఫాక్చరింగ్, ట్రేడ్, నిర్మాణ, విద్య, ఆరోగ్యం, ఐటీ, రవాణా, ఆతిథ్య రంగాల్లో కేవలం 6.41 లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. యువతకు శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాజువల్, కాంట్రాక్టు ఉపాధి మాత్రమే దగ్గరవుతోందని 'ఇండియా స్పెండ్' ఈ నివేదికలో పేర్కొంది.

More Telugu News