: సినీ ప్రముఖుల పేరు చెప్పి జ్యూయలరీ డిజైనర్ మోనీ అగర్వాల్ మోసం... పోలీసుల వేట!

విలువైన వజ్రాల నగలను, బంగారు ఆభరణాలను విక్రయిస్తానని సినీ ప్రముఖులు, ఆభరణాల దుకాణం యజమానులను సుమారు రూ. 3.5 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో జ్యూయలరీ డిజైనర్ మోనీ అగర్వాల్ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని మాదాపూర్ ప్రాంతంలో ఉండే మోనీ అగర్వాల్ కు నగల డిజైనర్ గా మంచి పేరుంది.

స్టార్ హోటళ్లలో ఆభరణాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ, వాటికి సినీ నటులను ఆహ్వానించి, పత్రికల్లో ప్రచారం కల్పించుకుని మరింత పేరు తెచ్చుకుంది. ఆపై వారికి సరసమైన ధరకు మంచి ఆభరణాలను డిజైన్ చేయించి ఇస్తానని చెబుతూ, మరోపక్క జ్యూయలరీ యజమానులను కలసి సెలబ్రిటీలు, సంపన్నులకు ఆభరణాలు విక్రయించి పెడతానని నమ్మబలికి వారి నుంచి విలువైన ఆభరణాలను తీసుకెళ్లింది. ఆపై డబ్బులు అడిగితే దాటవేస్తూ వచ్చింది. ఆమె ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ఆమె నిర్వాకాలపై, గణసింగ్ జ్యూయలరీ సంస్థ ఎండీ గౌతమ్ వాసుదేవ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోనీపై పలు సెక్షన్ల కింద కేసులను నమోదు చేసిన పోలీసులు, ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

More Telugu News