: మోదీని చంపేందుకు మాతో చేతులు కలుపు... రూ. 50 కోట్లు ఇస్తామంటూ పాకిస్థాన్ నుంచి ఆఫర్

ప్రధాని మోదీని చంపేందుకు పాకిస్థాన్ లోని శక్తులు విశ్వప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లాలో ఉండే సోని అనే వ్యక్తికి పాకిస్థాన్ కు చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ముంబైలో జరిగే ఒక ర్యాలీలో మోదీని చంపేందుకు తమతో చేయి కలపాలని... దానికి ప్రతిఫలంగా రూ. 50 కోట్లు ఇస్తామని ఆ వ్యక్తి ఆఫర్ చేశాడు. ఇప్పటికే దీని కోసం ఇద్దరు వ్యక్తులను ఎంపిక చేశామని, మూడో వ్యక్తి కూడా అవసరమని చెప్పాడు. ఈ డబ్బు సరిపోకపోతే... ఎంత డబ్బు కావాలన్నా ఇస్తామంటూ ఓపెన్ ఆఫర్ కూడా పెట్టాడు.

తొలుత ఈ ఫోన్ కాల్ ను సోనీ పట్టించుకోలేదు. కానీ, విషయానికి ఉన్న తీవ్రత దృష్ట్యా స్థానిక పోలీసులకు ఆయన సమాచారం ఇచ్చాడు. వెంటనే ఈ విషయాన్ని క్రైంబ్రాంచ్ కు అప్పగించారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ మిథిలేష్ కుమార్ మాట్లాడుతూ,  ఈ ఫోన్ కాల్ +79651219 అనే నంబర్ నుంచి వచ్చిందని... తాను పాకిస్థాన్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఆగంతుకుడు సోనీతో చెప్పాడని తెలిపారు. ఫోన్ కాల్ పై దర్యాప్తు ప్రారంభించామని... దర్యాప్తు పూర్తైతే అది నిజమైన కాలా? లేక ఫేక్ కాలా? అనే విషయం తెలుస్తుందని అన్నారు. అయితే, ఈ కాల్ కజకిస్థాన్ నుంచి వచ్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

More Telugu News