: సౌదీలో ట్రంప్ బిజీగా ఉన్న వేళ... మరో ఖండాంతర క్షిపణిని పరీక్షించి, సవాల్ విసిరిన కిమ్ జాంగ్

శత్రుదేశాల ఊహకందనంత వేగంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అడుగులు వేస్తున్నారు. వైరి దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గత ఆదివారం నాడు అత్యాధునిక బాలిస్టిక్ మిస్సైల్ ను ఉత్తరి కొరియా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఆ క్షిపణి పరీక్ష గురించి ఇతర దేశాలు ఇంకా సమీక్షిస్తుండగానే మరో క్షిపణిని కిమ్ జాంగ్ పరీక్షించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి విదేశీ పర్యటనలో భాగంగా సౌదీ అరేబియాలో బిజీగా ఉన్న సమయంలోనే... ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ క్షిపణి పరీక్షలో బిజీ బిజీగా ఉన్నారు. నిన్న మధ్యాహ్నం ఉత్తర కొరియా మరో క్షిపణిని పరీక్షించి, శత్రు దేశాలకు మరోసారి సవాల్ విసిరింది. అయితే, ఈ క్షిపణి ఎలాంటిది, దీని ప్రత్యేకతలు ఏమిటి? అనే వివరాలను మాత్రం ఆ దేశం వెల్లడించలేదు.

అయితే ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ మాత్రం ఇది కచ్చితంగా ఖండాంతర క్షిపణే అని తేల్చి చెప్పింది. ఈ క్షిపణి పరీక్షపై ఇంకా అమెరికా స్పందించాల్సి ఉంది. కిమ్ ఇంత దూకుడుగా వ్యవహరిస్తుండటం పట్ల అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరూ అంచనా వేస్తున్న దానికంటే ఎక్కువగానే ఉత్తర కొరియా వద్ద క్షిపణులు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

More Telugu News