: గులాబీ కండువా కప్పుకోనున్న టీటీడీపీ నేత రాథోడ్ రమేష్?

టీటీడీపీ నేత రాథోడ్ రమేష్ గులాబీ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యుడు, మాజీ ఎంపీ అయిన రాథోడ్ రమేష్ ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ద్వారా సీఎం కేసీఆర్ ను కలిశారని సమాచారం. ఈ నెల 29న రాథోడ్ రమేష్ తన కుమారుడు రితీష్, తన వర్గీయులతో కలిసి టీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. కాగా, వచ్చే నెలలో రాథోడ్ రమేష్ చిన్న కుమారుడి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ను ఆయన ఇటీవలే కలిసి పెళ్లి శుభలేఖ అందజేశారు. పనిలో పనిగా, తాను టీఆర్ఎస్ లో చేరే అంశాన్ని రాథోడ్ రమేష్ ప్రస్తావించినట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న రాథోడ్ రమేష్, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, ఆదిలాబాద్ ఎంపీగా కూడా ఆయన పని చేశారు.

More Telugu News