: జైలులో శశికళతో మంత్రి, ఎమ్మెల్యేల భేటీ.. సన్నబడినా మనోధైర్యంతో ఉన్నారన్న నేతలు
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళతో మంత్రి బాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాస్, తంగ తమిళ్ సెల్వన్, వెట్రివేల్, మాజీ మంత్రి బీవీ రమణలు భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల పరిస్థితులను, అన్నాడీఎంకే వ్యవహారాలను ‘చిన్నమ్మ’కు వివరించినట్టు తెలిసింది. గతంలో చాలామంది నేతలు శశికళను కలిసేందుకు ప్రయత్నించినా ఆ అవకాశం మాత్రం వీరికే దక్కడం గమనార్హం.
కాగా, జైలులోని ఆహారం సరిగా లేకపోవడంతో శశికళ బాగా చిక్కిపోయినట్టు ఓ ఎమ్మెల్యే తెలిపారు. అయితే ఆమె పూర్తి మనోధైర్యంతో ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలకు చిన్నమ్మ దర్శనభాగ్యం కలగడంతో మరికొందరు కూడా శిశికళ దర్శనానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నేతలు జైలుకెళ్లి శశికళను కలవడంపై పన్నీర్ వర్గానికి చెందిన ఎంపీ మైత్రేయన్ తీవంగా విమర్శించారు. శశికళ, దినకరన్ల కుటుంబాలను పార్టీ నుంచి బహిష్కరించినట్టు చెబుతున్న మంత్రి జయకుమార్ ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు. పళని ప్రభుత్వ నాటకాలకు తెరపడే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.