: ఆన్‌లైన్ పేకాటకు చెక్.. సెల్‌ఫోన్లో ఇంటిలో ఆడినా నేరమే.. తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం!

ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న జూదానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మురిపించి, మెరిపించి నట్టేట ముంచే ఈ ఆన్‌లైన్ జూదానికి చెక్ చెప్పాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ గేమింగ్ చట్టం-1974కు సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో ‘సైబర్ స్పేస్’ అనే పదాన్ని జోడించడం ద్వారా ఆన్‌లైన్‌లో జోరుగా సాగుతున్న గుర్రపు పందేలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్ వంటివాటిపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌లలో ఈ ఆటలు ఆడేవారిపై  కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. ఇంట్లో రహస్యంగా ఆడుతున్నామని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గేమింగ్ సైట్లలో తరచూ లాగిన్ అయ్యే వారిపై పోలీసులు నిఘా పెడతారు.

సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో వివరాలు సేకరించి క్రిమినల్, నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెడతారు. గేమింగ్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటారు. దాడుల్లో పట్టుబడే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా ఆట కోసం ఉపయోగించిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఈ నేరం చేస్తూ తొలిసారి పట్టుబడితే ఏడాది జైలు, రూ.5 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే అందుకు రెట్టింపు శిక్ష, జరిమానా విధిస్తారు. చట్టం సవరణకు న్యాయపరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తి అవడంతో త్వరలోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది.

More Telugu News