: జ‌గ‌న్ మోదీని కలిస్తే మీకేంటీ క‌డుపుమంట‌? వెంకయ్య ఈ రోజు ఏమ‌న్నారో తెలుసుక‌దా?: టీడీపీపై వైసీపీ నేత బొత్స‌ మండిపాటు

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీని త‌మ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి కలిసిన నేప‌థ్యంలో టీడీపీ నేత‌లు ఎన్నో విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఈ రోజు ఆయ‌న విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడుతూ... ప్రధానితో జగన్ భేటీ అయితే ఇంతమంది ఎందుకు తర్జనభర్జన పడుతున్నారో అర్థం కావడం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్న మాటలను గుర్తు చేశారు. ప్రధానితో ఎవరైనా సమావేశం కావచ్చని వెంకయ్య అన్నారని, ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించిన సంగతి టీడీపీ నేత‌ల‌కు తెలుసుక‌దా? అని బొత్స ప్ర‌శ్నించారు.

అసలు ప్ర‌త్యేక హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయం అని అన్న టీడీపీ నేత‌లకు అస‌లు ఈ రోజు హోదా అని వ్యాఖ్యానించే అర్హ‌త ఎక్క‌డిద‌ని ఆయ‌న అన్నారు. టీడీపీ నేత‌లు హోదా వ‌ద్ద‌న్నారని, ప్యాకేజ్ చాల‌న్నారని, అయితే, ఇప్పుడు కేసుల కొట్టివేత కోసం జ‌గ‌న్‌ ప్ర‌త్యేక హోదాపై పోరాటాన్ని పట్టించుకోకుండా మోదీని క‌లిశార‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని బొత్స మండిప‌డ్డారు.

హోదా సాధించుకోవడానికి తాము పోరాటం చేస్తూనే ఉంటామ‌ని బొత్స సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ ఎంపీలు కూడా ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు తెలిపితే, టీడీపీ ఎంపీలు మాత్రం ప్ర‌త్యేక హోదాపై రాజ్య‌స‌భ‌లో ఎందుకు మాట్లాడ‌లేదని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ మోదీని కలిస్తే మీకేంటీ క‌డుపుమంట‌, మీకున్న ఇబ్బంది ఏంటీ, కేసుల మాఫీ కోసం అంటారా? అని ప్ర‌శ్నించారు. మ‌ళ్లీ ఈ రోజు ప్ర‌త్యేక హోదా అంటూ వ్యాఖ్య‌లు చేయ‌డానికి సిగ్గ‌నిపించ‌డం లేదా? అని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదాపై వైసీపీ రాజీప‌డ‌బోదని బొత్స స‌త్య‌నారాయ‌ణ ఉద్ఘాటించారు.

More Telugu News