: ప్రఖ్యాత గురవాయూర్ ఆలయానికి బాంబు బెదిరింపు.. అణువణువూ శోధించిన పోలీసులు

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన గురవాయూర్ శ్రీకృష్ణ ఆలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో, కేరళ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ఉదయం ఆలయ అధికారులకు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి... ఆలయంలో బాంబు పెట్టానని బెదిరించాడు. దీంతో, ఆలయ అధికారులు షాక్ కు గురయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో, బాంబ్ స్క్వాడ్ సహా పోలీసులు అక్కడకు హుటాహుటీన చేరుకున్నారు. భక్తులందరినీ ఆ చుట్టు పక్కల లేకుండా చేసి, అణువణువూ శోధించారు. చివరకు ఎలాంటి బాంబు లేదని, ఫోన్ లో వచ్చినవి ఉత్తుత్తి బెదిరింపులేనని తేలడంతో... అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ ఆలయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

మరోవైపు, ఫోన్ బెదిరింపులు చేసిన సమయంలో ఆలయ అధికారులపై సదరు ఆగంతుకుడు తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆలయ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించాడు. అందుకే ఆలయాన్ని పేల్చేస్తున్నానని చెప్పాడు. ఈ నేపథ్యంలో, సదరు వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేశాడనే కోణంలో పోలీసులు దర్యాప్తును మొదలు పెట్టారు. 

More Telugu News