: ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గాల మధ్య భగ్గుమన్న కక్షలు.. ఇద్దరి హత్య

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గాల మధ్య వ్యక్తిగత కక్షలు భగ్గుమన్నాయి. శుక్రవారం రాత్రి ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తున్న బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు.

కరణం వర్గానికి చెందిన గోరంట్ల వెంకటేశ్వర్లు, అంజయ్య (48), పేరయ్య, యోగినటి రామకోటేశ్వరరావు (40) ముత్యాలరావు, వీరరాఘవులు రెండు ద్విచక్ర వాహనాలపై రాజుపాలెంలోని బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరై తిరిగి స్వగ్రామం బయలుదేరారు. గ్రామ  సమీపంలోకి రాగానే ఎమ్మెల్యే రవికుమార్ వర్గీయులైన మాలెంపాటి వెంకటేశ్వర్లు, గొట్టిపాటి మారుతి, శాఖమూరి సీతయ్యతోపాటు మరో 40 మంది వారి కళ్లలో కారం కొట్టి కర్రలతో దాడి చేసి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా గోరంట్ల అంజయ్య, యోగినాటి రామకోటేశ్వరరావు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం వేట ప్రారంభించారు.

More Telugu News