: వేగవంతమైన ఇంటర్నెట్ కోసం మూడు శాటిలైట్స్ ను ప్రయోగించనున్న ఇస్రో!

దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ స్పీడ్ ను మరింతగా పెంచే నిమిత్తం కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను ఇండియా స్పేస్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఇస్రో) త్వరలో లాంచ్ చేయనుంది. జిశాట్-19, జిశాట్-11, జిశాట్-20 కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను వచ్చే పద్దెనిమిది నెలలలో లాంచ్ చేయనున్నట్టు ఇస్రో విభాగం అయిన అహ్మదాబాద్ లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్ తపన్ మిశ్రా పేర్కొన్నారు. జూన్ లో జిశాట్-19 ను ప్రయోగిస్తామని, దీనిని ప్రయోగించడం ద్వారా కమ్యూనికేషన్ శాటిలైట్స్ లో కొత్త తరం ప్రారంభమవుతుందన్నారు.

కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో మనం ఇప్పటికే ఎన్నోమార్పులు చూశామని, ఇంటర్నెట్ ద్వారా వాయిస్, వీడియో కమ్యూనికేషన్స్ జరుగుతున్నాయన్నారు. వైర్ లెస్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఇంటర్నెట్ ద్వారా టెలివిజన్ కార్యక్రమాలను వీక్షించే రోజులు భవిష్యత్ లో రానున్నాయన్నారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్ ను ప్రయోగించడం ద్వారా టెలివిజన్, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ సిటీలకు భవిష్యత్ కమ్యూనికేషన్ అవసరాలకు అవి ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

More Telugu News