: విశాఖ మొఘల్ పుర కేసులో సీఐడీ దర్యాప్తు జరుగుతోంది: ఏపీ డీజీపీ సాంబశివరావు

విశాఖ మొఘల్ పుర కేసులో సీఐడీ దర్యాప్తు జరుగుతోందని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. మన దేశానికి చెందిన డబ్బు విదేశాలకు తరలి వెళ్తోందని ఐటీ శాఖ విచారణలో తేలిందని, కొందరు బోగస్ కంపెనీలు పెట్టి ఫోర్జరీ పత్రాలతో విదేశాలకు డబ్బు తరలించారని అన్నారు. 14 బోగస్ సంస్థల నుంచి కెనరా బ్యాంక్ కు రూ.533 కోట్లు వెళ్లడంపై సీఐడీ దృష్టి పెట్టిందని, 17 మంది నిందితులను సీఐడీ విచారణ చేస్తోందని తెలిపారు. తాను కేవలం బ్రోకరింగ్ మాత్రమే చేస్తానని ఈ కేసులో నిందితుడు వడ్డి మహేశ్ చెబుతున్నాడని, ఈ వ్యవహారం వెనుక, ఎవరున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

చైనా, సింగపూర్, హాంకాంగ్ కు రూ.600 కోట్ల వరకు ఎలా వెళ్లాయనే విషయంపై దర్యాప్తు జరుగుతోందని, ఈ కేసులో హవాలా లేదని, మనీలాండరింగ్ మాత్రమే ఉందని అన్నారు. వడ్డి మహేశ్ తో పాటు ఆయన బంధువులు, చార్టెర్డ్ అకౌంటెంట్లను అరెస్టు చేశామని, ఈ వ్యవహారంలో బ్యాంకుల పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని అన్నారు. ఆయుష్ గోయల్, వినీత్, వికాస్ గుప్తా లను ప్రధాన నిందితులుగా భావిస్తున్నామని, నిందితుల వివరాలను ఇంటర్ పోల్ కు కూడా తెలియజేస్తామని, ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్టు ఇప్పటివరకు తేలలేదని సాంబశివరావు తెలిపారు. 

More Telugu News