: పెళ్లి పందిరిని తగలబెట్టిన ప్రియురాలు.. పోలీసులను ఆశ్రయించిన ప్రియుడు

తనను మోసం చేసి మరో పెళ్లి చేసుకుంటున్నాడనే ఆగ్రహంతో... ఏకంగా పెళ్లి పందిరికే నిప్పు పెట్టిందో ప్రియురాలు. ఈ ఘటనకు ముందుగా సదరు బాధితుడికి సంబంధించిన బైక్ కి కూడా కొందరు నిప్పుపెట్టారు. ఆ విషయంపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడాయన. తాజాగా ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుండగా పెళ్లి పందిరికి నిప్పుపెట్టారంటూ మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడాయన. దీంతో, ఈ రెండు ఘటనలకు లింక్ ఉందని భావించిన పోలీసులు... ఆ కోణంలో దర్యాప్తు చేశారు. భాధితుడిపై వ్యక్తిగతంగా ఎవరికైనా కక్ష ఉందా అని విచారించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు 36 ఏళ్ల ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసు విచారణలో రెండు నేరాలనూ తానే చేసినట్టు ఆమె ఒప్పుకుంది. గత ఆరేళ్లుగా ఆ వ్యక్తితో తనకు శారీరక సంబంధం ఉందని... తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇప్పుడు వేరే అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతని తల్లిదండ్రులకు చెప్పినా వారు లెక్క చేయలేదని, అందుకే పెళ్లి పందిరిని తగలబెట్టానని చెప్పింది. బైక్ కూడా తాను బహుమతిగా ఇచ్చిందేనని... అందుకే దానికి నిప్పు పెట్టానని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆమెకు ఆదివారం వరకు కస్టడీ విధించారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

More Telugu News