: మీ వైఖరితో దేశ పరువును తీశారు... పాలకులను నిలదీస్తున్న పాకిస్థాన్ ప్రజలు

కులభూషణ్ జాదవ్ విషయంలో పాక్ పాలకుల వైఖరి కారణంగానే అంతర్జాతీయ న్యాయస్థానం ముందు పరువు పోయిందని ఆ దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాక్ జైల్లో ఉన్న కులభూషణ్ కు న్యాయ సహాయాన్ని అందివ్వని కారణంగానే ఇండియా ఇంటర్నేషనల్ కోర్టుకు ఎక్కిందని, ఇక్కడే ఓ లాయర్ ను ఏర్పాటు చేస్తే, ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు పాక్ వాసులు వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం మార్చిలో జాదవ్ ను పాకిస్థాన్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆపై దౌత్యాధికారులు అతన్ని కలిసేందుకు అనుమతించాలని, ఓ న్యాయవాదిని ఏర్పాటు చేసి సాయపడేందుకు సహకరించాలని ఇండియా సుమారు 16 సార్లు విజ్ఞప్తి చేసింది.

పాక్ ప్రభుత్వం జాదవ్ కు న్యాయవాదిని ఏర్పాటు చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని భారత్ ఆశ్రయించింది. "అసలు జాదవ్ కు న్యాయ సహాయం వద్దన్నది ఎవరు? ఆదిలోనే ఓ న్యాయవాదిని ఏర్పాటు చేస్తే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు" అని పాక్ హక్కుల కార్యకర్త అస్మా జహంగీర్ వ్యాఖ్యానించినట్టు 'డాన్' పత్రిక తెలిపింది. భారత జైళ్లలో ఎంతో మంది పాకిస్థానీలు మగ్గుతున్నారని గుర్తు చేసిన ఆమె, వారి విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించగలరా? అని ప్రశ్నించారు.

ఇదే విషయమై పాక్ ప్రముఖ న్యాయవాది యాసిర్ లతీఫ్ హమ్దానీ స్పందిస్తూ, జాదవ్ కు మొదట్లోనే ఓ న్యాయవాదిని ఏర్పాటు చేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. హేగ్ కోర్టులో ఏ కేసూ ఎక్కువ కాలం సాగదని గుర్తు చేసిన ఆయన, కేవలం 10 రోజుల్లోనే పాక్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా చూడటంలో ఇండియా సఫలమైందని, పాక్ న్యాయవ్యవస్థ వైఫల్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

More Telugu News