: యుద్ధం ఇప్పుడు కాదు... వచ్చినప్పుడు చూద్దాం: రజనీ నోట కీలక మాట

నేడు వరుసగా ఐదవ రోజు తన అభిమానులతో సమావేశమైన సూపర్ స్టార్ రజనీకాంత్, తన రాజకీయ ప్రవేశంపై మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అభిమానులను ఉద్దేశించి రజనీ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ మారాల్సి వుందని అన్నారు. తిరుచ్చి, అర్యలూరు, తిరంబళూరు ప్రాంతాలకు చెందిన అభిమానులతో భేటీ అయిన ఆయన, రాజకీయాల్లో మార్పును మనం తీసుకురావాలని అన్నారు. యుద్ధం ఇప్పుడు కాదని, యుద్ధం వచ్చినప్పుడు చూద్దామని తనదైన శైలిలో మాట్లాడారు.

రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలిస్తూ సాగిన ఆయన ప్రసంగంలో డీఎంకే నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. స్టాలిన్ లో తనకో నేత కనిపిస్తాడని, ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే, అవి మరింత ఫలవంతమవుతాయని అన్నారు. తాను రాజకీయాల గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమవుతాయని భావించలేదని అన్నారు. తనకు అభిమానులే బలమని, వారు వెన్నంటి ఉండగా, తనకు అపజయమన్నదే కలగదన్న నమ్మకముందని చెప్పారు.

More Telugu News