: మేము కదిలితే భూమండలం బద్దలవుతుంది... అధినేత ఆదేశాలిస్తే చాలంటున్న ఉత్తర కొరియా యూత్ ఆర్మీ

దయాదాక్షిణ్యాలు లేకుండా అమెరికా, దక్షిణ కొరియాలపై విరుచుకుపడతామని ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ప్రత్యేకంగా తయారు చేసుకున్న యువ సైన్యం శపథం చేసింది. 'కిమిల్ సున్గిస్ట్ - కిమ్ జాంగిలిస్ట్' పేరిట తయారైన యువ సైన్యం, తామే స్వయంగా అణు బాంబులను మోసుకెళ్లి వాటిని పేల్చి వస్తామని, తాము ఒక్క అడుగు వేస్తే, భూమండలం బద్దలవుతుందని హెచ్చరించింది.

అమెరికా సామ్రాజ్య వాదులను, దక్షిణ కొరియా తోలు బొమ్మలను నామరూపాల్లేకుండా చేస్తామని తెలిపారు. ఈ భువిపై దురాక్రమణదారులందరినీ, రెచ్చగొడుతున్న వారిని సమూలంగా నాశనం చేసి, ఆపై బాణసంచా కాల్చి చూపిస్తామని ఈ యువ సైన్యం ప్రతినబూనినట్టు కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వంలోని అధికారి ఒకరు తెలిపారు. వారిని చూసిన కిమ్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారని, ఉత్తర కొరియా భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని కొనియాడారని చెప్పారు.

"యువ సైన్యం సిద్ధంగా ఉంది. హెడ్ క్వార్టర్స్ నుంచి తుది ఆదేశాల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు మేము యుద్ధానికి పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. యాభై లక్షల అణు బాంబులు దాడికి రెడీగా ఉన్నాయి" అని ఈ యూత్ లీగ్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.

More Telugu News