: ఏపీ యువతకు డబుల్ ధమాకా... నిరుద్యోగులకు భృతి, స్టయిపెండ్ కలిపి రూ. 5 వేలు!

ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నెలకు రూ. 2 వేల భృతిని ఇస్తానన్న హామీని నిలుపుకునేందుకు కదిలిన చంద్రబాబు సర్కారు డబుల్ ధమాకాను ప్రకటించింది. నిరుద్యోగులకు వివిధ సంస్థల్లో శిక్షణ ఇప్పించి ఆపై వారికి అదే సంస్థలో ఉద్యోగాలు ఇప్పించాలని, శిక్షణా సమయంలో రూ. 2 వేల నిరుద్యోగ భృతితో పాటు, స్టయిఫండ్ గా రూ. 3 వేలు ఇవ్వాలని, విధి విధానాల ఖరారుకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రులు నారా లోకేశ్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలు సమావేశమై నిరుద్యోగ భృతి అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించింది.

పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ఆయా కంపెనీలకు అవసరమైన ఉద్యోగులను నిరుద్యోగ భృతి కింద దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేయాలని శిక్షణా సమయంలో కంపెనీయే స్టయిఫండ్ ఇవ్వాలని, ఆపై ఉద్యోగంలోకి తీసుకుంటే పూర్తి స్థాయి జీతం ఇవ్వాలని చర్చల అనంతరం లోకేశ్ మీడియాకు తెలిపారు. ఇక ఎంతమంది నిరుద్యోగులకు ఈ విధంగా చేయగలమన్న అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించామని, పథకం అమలుపై వచ్చే నెల 5వ తేదీన పారిశ్రామికవేత్తలు, పలు కంపెనీలతో సమావేశం కానున్నామని వెల్లడించారు. కాగా, నిరుద్యోగ భృతి కోసం ఇప్పటికే రూ. 500 కోట్లు కేటాయించగా, మరిన్ని నిధులను ఇచ్చే అంశాన్నీ ఈ కమిటీ పరిశీలించింది. పల్స్ సర్వే వివరాల ద్వారా నిరుద్యోగులను ఎంపిక చేయాలని, లబ్ధిదారుల ఎంపికకు ఇతర మార్గాలనూ అన్వేషిస్తున్నామని లోకేష్ తెలియజేశారు.

More Telugu News