: 160 ఎకరాల్లో అదిరిపోయే రీతిలో ఏపీ అసెంబ్లీ!
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అసెంబ్లీ భవనాన్ని 160 ఎకరాల్లో అద్భుతమైన రీతిలో నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో 140 ఎకరాలను కేవలం హరిత, జల అవసరాల కోసమే వినియోగించనున్నారు. రాజధాని నిర్మాణంపై నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ, పరిపాలనా భవనం డిజైన్లలో పలు మార్పులు చేసినట్టు తెలిపారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవనాలను ఉత్తర దిశగా కొంచెం ముందుకు జరిపినట్టు తెలిపారు. సచివాలయ భవనం 8 నుంచి 10 అంతస్తుల్లో కనీసం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని చెప్పారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ నగరాల్లో డ్రైవర్ లేని ఎలక్ట్రికల్ కార్లు నడుస్తుంటాయని... అమరావతిలో కూడా ఇలాంటి కార్లు నడవబోతున్నాయని తెలిపారు. సౌర విద్యుత్తును నిల్వచేసే అంశంపై అత్యున్నత సాంకేతిక పద్ధతులను తెలుసుకునేందుకు త్వరలోనే ఓ అంతర్జాతీయ సదస్సును నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు.