: శ్రీకాకుళంలో కొనసాగుతున్న పవన్ కల్యాణ్ ‘జనసేన’ శిబిరం

ఉత్సాహం, ఆస‌క్తి, సామాజిక సృహ ఉన్న యువ‌త కోసం సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘జ‌న‌సేన పార్టీ’ అన్వేషిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇందుకోసం ఉత్త‌రాంధ్ర‌లో ఆ పార్టీ యువ‌తను ఎంపిక చేసే ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తోంది. స్పీకర్స్, అనలిస్ట్స్, కంటెంట్ రైటర్స్‌గా సేవలు అందించడానికి ఉత్తరాంధ్ర నుంచి మొత్తం 6 వేల దరఖాస్తులు వ‌చ్చాయ‌ని, యువ‌త ఉత్సాహంగా పాల్గొంటున్నార‌ని జ‌న‌సేన పార్టీ మీడియా వ్య‌వ‌హారాల స‌మ‌న్వ‌య క‌ర్త హ‌రిప్ర‌సాద్ అన్నారు.

ఈ రోజు శ్రీ‌కాకుళంలో ఎంపిక‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ద‌ర‌ఖాస్తు చేసుకోలేక‌పోయిన వారు కూడా ఈ ఎంపిక‌ల్లో పాల్గొన‌వ‌చ్చని అన్నారు. ఇవి ఎంట్రెన్స్ టెస్ట్ లాంటివి కావని, యువ‌తలో ప్ర‌తిభ‌ను గుర్తించేందుకు మాత్ర‌మే ఈ ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తున్నామ‌ని తెలిపారు. ఈ రోజు, రేపు శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో ఈ ఎంపికలు జరుగుతున్నాయని, ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖలోని శ్రీకృష్ణ విద్యా మందిర్‌లోను, అనంతరం 23, 24, 25 తేదీల్లో గ్రేటర్ హైదరాబాద్ శివారులోని కొంపల్లిలోని ఏఎంఆర్ గార్డెన్స్‌లోను ఎంపికలు జరుగుతాయని వివరించారు. 

More Telugu News