: తలాక్ చెబితే కాదనే హక్కు మహిళకు ఉందా?: లా బోర్డుకు సుప్రీం ఆసక్తికర ప్రశ్న

ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ బద్ధమా? అన్న అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు సాగుతున్న వేళ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ముందు ధర్మాసనం ఓ ఆసక్తికర ప్రశ్నను ఉంచింది. కట్టుకున్న భర్త మూడు సార్లు తలాక్ చెప్పి ఆమెను వదిలించుకోవాలని చూసే సమయంలో తప్పనిసరిగా భార్య అందుకు కట్టుబడి వుండాలా? లేక 'నో' చెప్పే అవకాశం ఉందా? అని చీఫ్ జస్టిస్ జగదీశ్ సింగ్ కేహార్ ప్రశ్నించారు. ఒకవేళ లేకుంటే 'నిఖానామా' ఆ మేరకు ఓ సవరణను చేసే వీలుంటుందా? అని లా బోర్డు తరఫున వాదనలు వినిపించేందుకు హాజరైన కపిల్ సిబల్ ను ప్రశ్నించారు.

దీనిపై సిబల్ స్పందిస్తూ, కోర్టు సూచించిన సవరణను మానవతా దృక్పథంతో లా బోర్డు పరిశీలిస్తుందని తెలిపారు. అయితే దీనిపై చర్చ జరగాల్సి వుంటుందని వెల్లడించారు. కాగా, సుప్రీంకోర్టు, కపిల్ సిబల్ ల మధ్య జరిగిన ఈ వాదనల తరువాత లా బోర్డు మరో న్యాయవాది యూసుఫ్ ముచాల్లా స్పందిస్తూ, బోర్డుకు సుప్రీంకోర్టు చేసిన సలహాను ఖాజీలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా నేడు ఐదో రోజు తలాక్ పై వాదనలను కోర్టు వింటుండగా, రేపటితో వాదనలు ముగియనున్నాయి.

More Telugu News