: ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి... పతంజలి సంస్థ పరిశోధన

ప్రముఖ ఆయుర్వేద, సంప్రదాయ ఔషధాల ఉత్పత్తి సంస్థ పతంజలి... గృహావసరాల కోసం విద్యుత్‌ ను ఉత్పత్తి చేసే విధానంపై అధ్యయనం చేస్తోంది. టర్కీకి చెందిన సంస్థతో పాటు, ఆటోమెబైల్ ఎమ్మెన్సీతో కలిసి పతంజలి సంస్థ గత రెండేళ్లుగా హరిద్వార్‌ లో ఈ పరిశోధనలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పతంజలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాలకృష్ణ మాట్లాడుతూ, ఎద్దులకు సామర్థ్యం ఎక్కువ కాబట్టి, వాటిని ఉపయోగించి టర్బైన్‌ తిరిగేలా విద్యుత్‌ ఉత్పత్తి నమూనాను రూపొందించామని ఆయన చెప్పారు.

ఈ విధానంలో తొలి దశ ప్రయత్నాల్లో 2.5 కిలోవాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సాధించామని ఆయన వెల్లడించారు. ఈ విధానం ద్వారా ప్రస్తుతం అధిక మొత్తంలో విద్యుదుత్పత్తి సాధ్యం కాదని భావిస్తున్నామని, అయితే ఇలా ఎద్దులను వినియోగించి టర్బైన్ ద్వారా తయారు చేసిన విద్యుత్ ను నిల్వ ఉంచడం తేలిక అని ఆయన తెలిపారు. ఈ విద్యుత్ ను నివాసాల్లో దీపాలు వెలిగించేందుకు, ఇతర తేలికపాటి అవసరాలకు వినియోగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇలా ఎద్దులను విద్యుత్ తయారీకి వినియోగించడం ద్వారా వాటిని కబేళాలకు తరలించడం తగ్గుతుందని ఆయన తెలిపారు.

More Telugu News