: మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో అద్భుత రికార్డు

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో టీమిండియా మాజీ కెప్టెన్, గతంలో చెన్నై జట్టుకు, ప్రస్తుతం రైజింగ్ పుణే సూపర్ జెయింట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ మరో అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇప్పటివరకూ 10 సంవత్సరాల పాటు ఐపీఎల్ పోటీలు జరుగగా, అందులో ఏడు సార్లు ఫైనల్ ఆడనున్న ఆటగాడిగా ధోనీ నిలిచాడు. ఐపీఎల్ లో మరే ఆటగాడికీ ఈ రికార్డు దగ్గర కాలేదు.

చెన్నై తరఫున ఆరుసార్లు ఫైనల్ మ్యాచ్ ఆడి, రెండు సార్లు కప్పును అందించిన ధోనీ, ఇప్పుడు పుణె తరఫున మరోసారి ఆదివారం జరిగే ఫైనల్ పోరులో బరిలోకి దిగనున్నాడు. చెన్నై జట్టు ఫిక్సింగ్ ఆరోపణల్లో చిక్కుకున్న తరువాత, రెండేళ్ల పాటు ఆ జట్టును బహిష్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ధోనీని పుణె జట్టు కొనుగోలు చేసింది. గత రెండు సీజన్ల నుంచి ధోనీ పుణె జట్టుకు ఆడుతున్నాడు. ఈ సంవత్సరం కెప్టెన్ బాధ్యతలకు దూరమైనా, అన్ని మ్యాచ్ లలో స్టీవ్ స్మిత్ కు చేదోడు, వాదోడుగా నిలిచి తనదైన సహకారాన్ని అందిస్తూ, కీలక మ్యాచ్ లలో రాణించి, జట్టు ఫైనల్ కు చేరడంలో సహాయం చేశాడు.

More Telugu News