: భక్తులకు షాక్... టీటీడీని తాకిన వాన్నా క్రై దెబ్బ

ప్రపంచం మొత్తాన్ని బెంబేలెత్తించిన ఉత్తరకొరియా లాజరస్ గ్రూప్ ర్యాన్సమ్ వేర్ వాన్నా క్రై బారిన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా పడింది. టీటీడీకి చెందిన సుమారు 20 కంప్యూటర్లు ఈ వైరస్‌ బారిన పడి హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ సైబర్ దాడి కేవలం పరిపాలనా పరిమైన అంశాలకు సంబంధించిన కంప్యూటర్లకు మాత్రమే పరిమితం కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సైబర్ ఎటాక్ వల్ల భక్తులకు సమాచారం అందించే వ్యవస్థపై ఎలాంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు.

టీటీడీ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన సాఫ్ట్‌ వేర్‌ ను వినియోగిస్తున్నప్పటికీ సైబర్ హ్యాకింగ్ కు గురికావడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కిందిస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియకుండా పైరేటెడ్‌ సాఫ్ట్‌ వేర్‌ ను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసిన కారణంగా ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్ అటాక్ అంశం తెలియగానే ఆ కంప్యూటర్లను అధికారులు యుద్ధ ప్రాతిపదికన తొలగించి, ఇతర కంప్యూటర్లకు ఆ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, భక్తులు హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. 

More Telugu News