: అధికారులకు తలనొప్పిగా మారిన విజయవాడ ‘మెట్రో’!

విజయవాడకు మెట్రో రైలు వచ్చిందని సంతోషపడిన వారికి ఇది కాస్తా బాధ కలిగించే వార్తే. భూముల ధరలు పెరగడంతో మెట్రో కోసం భూములు ఇచ్చేందుకు స్థల యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో ప్రాజెక్టు తీరు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా తయారైంది. పెనమలూరు మండలంలోని అశోక్ నగర్, సిద్ధార్థ కళాశాల, తాడిగడప, గులాబీతోట, పోరంకి, పెనమలూరు సెంటర్, కృష్ణా నగర్ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో భూసేకరణకు అధికారులు మార్కింగ్ ఇచ్చారు.

అయితే స్థల యజమానులు మాత్రం భూమిని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఉన్న స్థలాన్ని ఇచ్చేస్తే మాకు దిక్కేంటి? అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెట్రో రైలు కోసం స్థల సేకరణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం కూడా అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. దీంతో మెట్రోపై ఏం చేయాలన్న అంశం అధికారుల వద్ద చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. స్వచ్ఛందంగా స్థలం ఇవ్వకుంటే ప్రజావసరాల దృష్ట్యా బలవంతంగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి స్పందన లేదు.

More Telugu News