: ఎయిర్ పోర్టులో చైనాకు చెందిన 10 అత్యాధునిక డ్రోన్స్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు

ఓ ప్రయాణికుడి నుంచి చైనాకు చెందిన 10 అత్యాధునిక డ్రోన్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్న ఘ‌ట‌న బెంగళూరులోని కెంపెగౌడ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. ఆ ప్ర‌యాణికుడి వ‌ద్ద ‘‘హై ఎండ్ డిజేఐ పాంథమ్-4ప్రో’’ అనే డ్రోన్స్ లభించాయని  అధికారులు వివ‌రించారు. భద్రతాపరమైన ప్రమాదం ఉన్న ఈ డ్రోన్ల‌ను ఆ ప్ర‌యాణికుడు ఇక్క‌డకు ఎందుకు తీసుకొచ్చాడ‌న్న అంశంపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు చెప్పారు. అంతేగాక‌, ఇటువంటి మరిన్ని డ్రోన్స్ చెన్నై, బెంగళూరులో ఉన్నట్లు అధికారులు తెలుసుకుని, వాటికోసం గాలింపు చేపట్టారు.

ఈ రోజు స్వాధీనం చేసుకున్న డ్రోన్లు డిజేఐ పాంథమ్-4 ప్రొ డ్రోన్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవిగా అధికారులు తెలిపారు. వీటిల్లో ఇంటెలిజెంట్ బ్యాటరీ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ నావిగేషన్ సిస్టమ్, జీపీఎస్, రష్యన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చారని పేర్కొన్నారు. ఈ డ్రోన్లు సుమారు 6 కిలో మీటర్ల ఎత్తు వ‌ర‌ర‌కు ఎగరగల‌వ‌ని, వీటిల్లో అరకేజీ బరువు గల వస్తువులను కూడా తీసుకెళ్లవ‌చ్చ‌ని అన్నారు. వీటి సాయంతో వీడియోలు, ఫోటోలు తీస్తే పూర్తిగా హెచ్‌డీ క్లారిటీతో వస్తాయని తెలిపారు.

More Telugu News