: నువ్వు సినిమా హీరోయిన్ వా?...ఈ తిరుగుళ్లేంటి? అంటూ రోడ్డున పడేశారని వాపోతున్న వర్థమాన హీరోయిన్

యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ తో 'మున్నా మైఖేల్' సినిమాతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన నిధి అగర్వాల్ రోడ్డున పడింది. సినిమాల్లో ఓ వెలుగు వెలగాలని బెంగళూరు నుంచి ముంబైకి వచ్చిన నిధి, గత ఏడాదిగా బాంద్రాలో ఓ అపార్ట్‌ మెంట్‌ లో స్నేహితురాలితో కలిసి ఉంటోంది. అయితే ఈ హౌసింగ్ సొసైటీ ఇటీవల ఆమెను ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేసింది. దానికి కారణాన్ని కూడా సొసైటీ సభ్యులు వివరించారు.

దీనిపై నిధి మాట్లాడుతూ, 'ఆరు నెలలుగా స్నేహితురాలితో కలిసి ఉంటున్నాను. అయితే సింగిల్ గా ఉన్న నటి, మోడల్స్ పై వీరికి చాలా చిన్న చూపు. నేను సింగిల్‌ గా ఉన్నందున ఏదైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నానేమోనని సొసైటీ భావిస్తోంది. సినిమా షూటింగ్స్ కారణంగా తాము ఏ సమయానికి ఇంటికి చేరుతామో తెలియదు. దాంతో పొరుగువారికి నచ్చడం లేదు. వారి అనుమానాలను హౌసింగ్ సొసైటీలో కొందరు సమర్థించడంతో... నువ్వు హీరోయిన్ వా?... అయితే అర్ధరాత్రి ఈ రావడాలేంటి? అంటూ అనుమానంగా అడుగుతున్నారు. అంతే కాకుండా ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అంతేకాదు... ఎక్కడైనా మంచి ప్రదేశంలో ఇల్లు వెతికితే... నువ్వు సింగిల్, సినిమాల్లో నటిస్తున్నావా? అంటూ నాకు ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో నా పరిస్థితి రోడ్డున పడ్డట్లు తయారైంది' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఇలాంటి  కష్టాలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షబానా అజ్మీ, ఇమ్రాన్ హష్మీ తదితరులు కూడా ఎదుర్కొన్నారు.

More Telugu News