: తన చెల్లిని కత్తితో పొడిచి చంపేసిన బాలిక!

ఓ బాలిక త‌న చెల్లిని క‌త్తితో పొడిచిన ఘ‌ట‌న అనంతపురం జిల్లా బత్తలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. తీవ్ర గాయాలపాల‌యిన బాలిక‌ను ఆసుప‌త్రికి త‌రలించ‌గా ఆమె అప్ప‌టికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... ఆ ప్రాంతంలో నివాసం ఉండే పెద్దన్న అనే వ్య‌క్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వారిద్ద‌రినీ ఇంట్లో ఉంచి, బ్యాంకు పని నిమిత్తం పెద్దన్న త‌న భార్య‌తో క‌లిసి బయటకు వెళ్లాడు. ఇంటి వ‌ద్దే ఆ బాలిక‌లు ఇద్ద‌రూ ఆడుకుంటున్నారు. ఆ స‌మ‌యంలో వారిద్ద‌రి మధ్య చిన్న విషయంలో గొడవ చెల‌రేగింది. ఆవేశంతో ఊగిపోయిన అక్క వంటింట్లోకి వెళ్లి క‌త్తిని తీసుకొచ్చి తన చెల్లి గౌరి(11)ని పొట్టలో పొడిచింది. కొద్దిసేప‌టికి ఆ బాలిక‌ల త‌ల్లిదండ్రులు ఇంటికి రాగా గౌరి ర‌క్త‌పు మ‌డుగులో క‌నిపించింది. దీనిపై కేసు న‌మోదు చేసుకున్న‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News