: రేవంత్ రెడ్డీ... నిన్ను బట్టలూడదీసి కొడతారు: మంత్రి తుమ్మల నిప్పులు

ఖమ్మంలో జరిగిన మిర్చి రైతుల ఆందోళన, ఆపై జరిగిన ఘటనలపై తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి కపట రాజకీయాలు చేస్తున్నారని, ఆయన్ను ప్రజలు రోడ్లపై బట్టలూడదీసి కొట్ట రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. విపక్షాలన్నీ కలసి పోరంబోకులను రంగంలోకి దించి, వాళ్లతో రాళ్లు వేయించారని, రైతుల అరెస్టుకూ వాళ్లే కారణమని ఆరోపించారు. ఈ ఉదయం ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన, రైతులు ఎంత మిర్చి పంటను సాగుచేశారో కూడా తెలియకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని అన్నారు.

పిట్టల దొరలా వచ్చిన రేవంత్ రెడ్డి తుపాకి రాముడి మాటలు మాట్లాడి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పాలేరు ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసినా తమకు భారీ మెజారిటీ వచ్చిందని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో చేస్తున్నదని అన్నారు. తమ రాజకీయ మనుగడ కోసమే విపక్షాలు ఇటువంటి విమర్శలకు దిగుతున్నాయని, రేవంత్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేస్తే మంచిదని అన్నారు. కేంద్రం క్వింటాలు మిర్చికి రూ. 5 వేల మద్దతు ధరతో 35 వేల క్వింటాళ్లకు అమతివ్వగా, తాము రూ. 6,900కు క్వింటాలును కొంటున్నామని తెలిపారు.

More Telugu News