: యాక్సిస్ బ్యాంకు సాయంతో బ్లాక్ మనీని మార్చుకున్న కేజ్రీవాల్.... సాక్ష్యాలు చూపుతూ కపిల్ మిశ్రా సంచలన ఆరోపణ

నేడు ఢిల్లీ ప్రజలు విస్తుపోయేలా అరవింద్ కేజ్రీవాల్ అవినీతి బాగోతాలను బట్టబయలు చేస్తానని చెప్పిన బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా అన్నంతపనీ చేశారు. పదికి పైగా స్పైరల్ బైండింగ్ చేసిన పుస్తకాలను చూపిస్తూ, ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన నిధులను కేజ్రీవాల్ ఎలా వాడుకున్నారో వెల్లడించారు. బ్లాక్ మనీని యాక్సిస్ బ్యాంకు ద్వారా వైట్ మనీగా కేజ్రీ మార్చుకున్నారని ఆరోపించారు. పార్టీకి రూ. 25 కోట్లు విరాళంగా వస్తే, రూ. 20 కోట్లను లెక్కలోకి చూపి, రూ. 5 కోట్లను ఆయన నొక్కేశారని చెప్పారు.

మిగతా డబ్బులో రూ. 15 కోట్ల మొత్తాన్ని కూడా ఆయన స్వీయ అవసరాలకు, నేతల విదేశీ పర్యటనలకూ వాడారని చెప్పారు. ప్రతి ఖాతాకు సంబంధించిన బ్యాంకు వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఎలక్షన్ కమిషన్ తో పాటు, సీబీఐ, ఏసీబీ అధికారులకు ఇవ్వనున్నానని వెల్లడించారు. వందలాది కంపెనీల్లో కేజ్రీవాల్ కు చట్ట విరుద్ధమైన వాటాలు ఉన్నాయని, ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల మొత్తాలున్నాయని అన్నారు. కేజ్రీవాల్ ప్రారంభించిన షెల్ కంపెనీల వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని అన్నారు. ఆయన మీడియా సమావేశం కొనసాగుతోంది.

More Telugu News