: జయలలిత వంటమనిషిపై హత్యాయత్నం.. తమిళనాట వరుస ఘటనలు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరుగుతున్న అనుమానాస్పద మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇటీవల కొడనాడులోని ఆమె ఎస్టేట్‌లోని వాచ్‌మన్ దారుణహత్యకు గురికాగా, ఆ తర్వాత ఎస్టేట్‌లో జరిగిన దోపిడీకి నేతృత్వం వహించిన జయ మాజీ డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరో మాజీ డ్రైవర్ సయాన్ కూడా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రమాదంలో అతడి భార్య,  పిల్లలు మృతి చెందారు. అలాగే పలువురు మంత్రులు, ఐపీఎస్‌ల వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన రవిచంద్రన్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

తాజాగా జయ నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంచవర్ణం (80)పై శనివారం హత్యాయత్నం జరిగింది. ఉదయం ఇంటి వద్ద ఉన్న ఆయనపై ఐదుగురు దుండగులు మారణాయుధాలతో దాడిచేసి పరారయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నం కేసును నమోదు చేసేందుకు సైదాపేట పోలీసులు నిరాకరించడంతో పంచవర్ణం కుమారుడు, అన్నాడీఎంకే ప్రభుత్వంలో సమాచార, పౌరసంబంధ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసిన మురుగేశన్ అసిస్టెంట్  పోలీస్ కమిషన‌ర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

More Telugu News