: పదే పదే అదే మాట అంటున్నారు.. హరీశ్‌రావు బహిరంగ చర్చకు రావాలి: మాజీ ఎంపీ పొన్నం సవాల్

తెలంగాణ భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావుపై కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిప‌డ్డారు. ప్రాజెక్టుల‌కు త‌మ పార్టీ అ‌డ్డుప‌డుతోంద‌ని హరీశ్‌రావు త‌రుచూ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, ప్ర‌జలను రెచ్చగొట్టాల‌ని చూస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఈ రోజు పొన్నం ప్ర‌భాక‌ర్ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ... త‌మ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న 2013లో భూసేకరణ చట్టాన్ని అమోదించిందని అన్నారు. అప్పుడు కేసీఆర్‌ కూడా లోక్‌సభ సభ్యుడేనని వ్యాఖ్యానించారు.

ప్రాజెక్టుల నిర్మాణం కోసం త‌మ‌పార్టీ చేసిందేమిటో ఇప్పుడు టీఆర్‌ఎస్‌ చేసిందేమిటో తేల్చుకుందామని సవాల్‌ విసిరారు. హరీశ్‌రావు బహిరంగ చర్చకు రావాల‌ని అన్నారు. 2013 భూసేకరణ చట్టం రైతులను ముంచేలా ఉందని హ‌రీశ్‌రావు త‌రచూ వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, మ‌రి లోక్‌స‌భ‌లో ఆ చ‌ట్టానికి అప్ప‌ట్లో కేసీఆర్ ఎలా ఆమోదం తెలిపి ఓటు వేశారో తెలపాల‌ని నిల‌దీశారు. భూనిర్వాసితుల నోట్లో మట్టికొట్టే చర్యలకు పాల్ప‌డ‌కూడ‌ద‌ని పొన్నం హిత‌వు ప‌లికారు.

More Telugu News