: కళ్ల ముందే తగులబడిపోతున్న భార్య... ఏమీ చేయలేక నిశ్చేష్టుడైన భర్త!

హైదరాబాదులోని యాచారంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాదు శివారు ఇబ్రహీంపట్నం సమీపంలోని యాచారం మండలంలోని తక్కలపల్లికి ఓ కుటుంబం తమ కారులో వెళుతోంది. అదే సమయంలో యాచారం సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అంతలో వారి కారు ఆకక్డికి చేరుకుంది. పోలీసులు ఆపమనడంతో కారును ఆపారు. ఇంతలో కారులోని ఓ మహిళ డోర్ తీసి, కారుపై భాగాన్ని పట్టుకుంది.

అయితే, అప్పటికే కారు డోర్ కు తగిలిన హైటెన్షన్ విద్యుత్ వైరు ద్వారా విద్యుత్ ప్రవహించి, క్షణాల్లో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న ఇతర కుటుంబ సభ్యులు కారులోంచి కిందికి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. సదరు మహిళ మాత్రం అందరూ చూస్తుండగానే, కారుతో పాటుగా, సెకెన్ల వ్యవధిలో బూడిద కుప్పగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు కూడా ఏమీ చేయలేక నిస్సహాయులుగా వుండిపోయారు. సదరు మహిళ పేరు చంద్రకళ అని తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబం శోకంలో మునిగిపోయింది. ఆ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. పోలీసులు మాత్రం విద్యుత్ శాఖపైన, రోడ్డు మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్ పైన కేసులు నమోదు చేశారు.  

More Telugu News